1వ అధ్యాయము: అర్జున విషాద యోగము

అర్జున విషాద యోగము

దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మొదలవ్వబోతున్న గొప్ప మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతంలో, భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది.  
    ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయుడికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలౌతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత, తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు, అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెప్తున్నాడు. సంజయుడు, మహాభారతాన్ని రచించిన మహాత్ముడైన వేద వ్యాసుని శిష్యుడు. వేద వ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి వుంది. అదే శక్తిని సంజయుడికి, యుద్ధభూమిలో జరిగే విశేషాలని ధృతరాష్ట్రునికి వివరించటానికి, ఆయన ప్రసాదించాడు.

ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?

సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను.

దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.

వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.

ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.

మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.

ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.

మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం, పరిమితమైనది.

కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.

అప్పుడు, కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు, సింహంలా గర్జించాడు, మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ, దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను.

ఆ తరువాత, శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి, మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.

ఆ తరువాత, పాండవ సైన్యం మధ్యలోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు.

హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.

ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.

ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.

ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.

దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.

సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.

భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు ఇతర రాజుల సమక్షంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము.

అక్కడ, రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను, మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను.

అక్కడున్న తన బంధువులందరినీ చూసిన కుంతీ పుత్రుడు అర్జునుడు, కారుణ్య భావం ఉప్పొంగినవాడై, తీవ్ర దుఃఖంతో ఈ విధంగా పలికెను.

అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది.

నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.

ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?

గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి వున్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?

ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము?

వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?

వంశ నాశనం జరిగినప్పుడు, ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును, మరియు మిగిలిన కుటుంబసభ్యులు అధర్మపరులగుదురు.

దుర్గుణాలు ప్రబలిపోవటం వలన, ఓ కృష్ణా, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు; మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన, ఓ వృష్ణి వంశస్థుడా, అవాంఛిత సంతానం జన్మిస్తారు.

అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు, కుల నాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమయిన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమౌదురు.

కుటుంబ ఆచారము నాశనము చేసి, అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానేక సామాజిక, కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును.

ఓ జనార్దనా (కృష్ణా), కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను.

అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలుగచేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.

సంజయుడు పలికెను: ఈ విధంగా పలికిన అర్జునుడు, దీనస్థితిలో, తీవ్ర శోకసంతప్తుడై తన బాణాలను, ధనుస్సును పక్కన జారవిడిచి, రథంలో కూలబడ్డాడు.