2వ అధ్యాయము: సాంఖ్య యోగము

సాంఖ్య యోగము

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్దంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువు గా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ భాద్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక భాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది ఉత్తమ గతుల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, తలవంపు, అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.

అర్జునుడిని లౌకిక స్థాయి నుండి పైకి తీసిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని 'బుద్ధి యోగము' అన్నాడు. బుద్దిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితిని చేరుకుంటాడు.

దివ్య జ్ఞానం లో ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం లో ఉన్న వారు మోహము, భయం, కోపములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖః-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన - కామము, క్రోధము, లోభములు - ఎలా ఎదుగుతాయో, వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

సంజయుడు పలికెను : జాలి నిండినవాడై, శోకతప్త హృదయం తో, కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు ఈ విధంగా పలికెను.

శ్రీ భగవానుడు ఇట్లనెను: ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ గతులకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది.

ఓ పార్థా, ఈ యొక్క పిరికి తనమునకు లొంగిపోవటం నీకు తగదు. ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము, ఓ శత్రువులను జయించేవాడా.

అర్జునుడు ఇలా అన్నాడు: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా.

నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తం తో కళంకితమై ఉంటాయి.

ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా తెలియదు - వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా. వారిని చంపిన తరువాత కూడా మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షం లో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు.

నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శేయస్కరమో దానిని ఉపదేశించుము.

నా ఇంద్రియములను శుష్కింప చేసే ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, దేవతల వంటి అధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.

సంజయుడు పలికెను: ఈ విధంగా అన్న గుడాకేశుడు, శత్రువులను శిక్షించేవాడు, హృషీకేశునితో : "గోవిందా, నేను యుద్ధం చేయను" అంటూ మౌనముగా అయిపోయాడు.

ఓ ధృతరాష్ట్రా! ఆ తరువాత, ఇరు సేనల మధ్యలో, శోకసంతుప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.

భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞత తో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింప కూడని దాని కోసం శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, వివేకవంతులు శోకింపరు.

నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము.

ఏ విధంగానయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము (శరీరము) లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు.

ఓ కుంతీ పుత్రా, ఇంద్రియ-విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన, అనిత్యమైన సుఖ-దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు; ఇవి వేసవి, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా, కలత చెందకుండా వీటిని సహించటం నేర్చుకోవాలి.

ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖముల చే ప్రభావితం కాకుండా, రెండిటిలో చలించకుండా నిశ్చలముగా ఉన్నవాడు మోక్షమునకు అర్హుడవుతాడు.

క్షణభంగురమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని యథార్థముగా గమనించి ఉన్నారు.

శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నశింపచేయలేరు.

ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; కానీ అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యము కానిది మరియు సనాతనమైనది (నిత్యమైనది). కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.

ఆత్మ ఇతరులను చంపును అని అనికోనేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడేది అనుకొనేవాడు ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.

ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.

ఓ పార్థ, ఆత్మ నాశనం చేయబడలేదు, నిత్యమైనది, జనన-మరణములు లేనిది అని తెలిసినవాడు, ఎట్లా చంపును (ఎవరినైనా)? ఎట్లా చంప కారణం అవ్వగలడు?

ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో అదే విధముగా జీవాత్మ, మరణ సమయములో పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.

ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి అరిపోవునట్లు చేయలేదు.

ఆత్మ, ఛేదింపబడలేదు మరియు దహింపబడదు; అది (నీటిచే) తడుపబడదు, దానిని ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, సర్వ వ్యాపి, మార్చలేనిది, పరివర్తనలేనిది మరియు సనాతనమైనది.

ఆత్మ అనేది అవ్యక్తమైనది (కనిపించనిది), ఊహాతీతమైనది మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు.

కానీ ఒకవేళ నీవు, ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ మహా బాహువులు కలవాడా, ఇలా శోకించటము తగదు.

పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.

ఓ భరత వంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు?

కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు, విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు.

ఓ అర్జునా, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది; కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు.

ఇంకా, నీ యొక్క క్షత్రియ స్వ-ధర్మమమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి, ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దాని కన్నా మించిన కర్తవ్యం లేదు.

ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే అవకాశాలు, కోరుకోకుండానే దొరికిన, క్షత్రియులు అదృష్టవంతులు. ఇది వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము.

కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు.

జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా నీచమైనది.

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనయిపోతుంది. అయ్యో, దీని కంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీర మరణం పొంది స్వర్గానికి పోయెదవు లేదా విజయుడవై ఈ రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి తయారుకమ్ము.

సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని సమానంగా తీసుకుంటూ - కర్తవ్య నిర్వహణగా యుద్ధం చెయుము. నీ భాద్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.

ఇప్పటివరకు నేను నీకు సాంఖ్య యోగం, అంటే, ఆత్మ తత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును, వివరించాను. ఇప్పుడు వినుము, ఓ పార్థ, నేను బుద్ది యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పని చేసినప్పుడు నీవు కర్మ బంధములనుండి విముక్తి పొందెదవు.

ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు, ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదాలనుండి కాపాడును.

ఓ కురు వంశస్తుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ది ధృడంగా/స్థిరంగా ఉంటుంది, వారి లక్ష్యము ఒక్కటే. కానీ, స్థిరంగాలేని వారి బుద్ది పరిపరి విధములగా ఉంటుంది.

పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గ లోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను సూచించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే, మాటలకు ఆకర్షితులై, అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆ భాగాలని కీర్తిస్తూ, ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, స్వర్గలోక ప్రాప్తి మొదలగువంటి వాటి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు.

ప్రాపంచిక భోగాలు, సుఖాల పై మిక్కిలి మమకారంతో, వారి బుద్ధి చిత్తభ్రాంతికి లోనయ్యి, భగవద్ప్రాప్తి పథం లో సాఫల్యానికి కావలసిన ధృడ సంకల్పాన్ని వారు కలిగి ఉండలేరు.

అర్జునా, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిలో ఉండుము. ద్వందముల నుండి విడివడి, నిత్యమూ పరమ సత్యం లో స్థితమై ఉండి, మరియు భౌతిక లాభాలు, భద్రత ల గురించి పట్టించుకోకుండా ఆత్మ భావన యందే స్థితుడవై ఉండుము.

ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలను తో తీరుతాయి. ఆ విధంగానే పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వాడు అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేరుస్తాడు.

శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.

జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము, ఓ అర్జునా. ఇటువంటి సమత్వ బుద్దియే యోగము అనబడుతుంది.

దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమునే ఆశ్రయించుము. ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని అధ్యాత్మిక దివ్య జ్ఞానం లో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను భోగించగోరే వారు లోభులు/పిసినారులు.

వివేకముతో ఈ కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యం తో (సరియైన దృక్పథం తో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.

జ్ఞానులు, సమత్వ బుద్ది కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి భావన తో పని చేయటం వలన దుఃఖరహితమైన స్థితిని పొందెదరు.

మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).

కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.

అర్జునుడు పలికెను : ఓ కేశవా, భగవత్ ధ్యాస నందే స్థిరముగా ఉన్న (స్థితప్రజ్ఞుని) వాని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? అతను ఎలా కూర్చొనును? అతను ఎలా నడుచును?

భగవానుడు పలికెను : ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్ధ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానం లో సంతుష్టుడు అయినప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.

దుఃఖముల నడుమ కూడా కలతచెందని వాడు, సుఖముల కోసం ప్రాకులాడని వాడు; మమకారము, భయము, క్రోధము విడిచిన వాడిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.

ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానం తో ఉన్న ముని.

తాబేలు తన పైచిప్ప లోనికి, దాని అంగములను ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్ధముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.

సాధకులు ఇంద్రియములను భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును.

ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.

ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.

ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, ఆ కోరికల నుండే క్రోధం ఉత్పన్నమవుతుంది.

కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.

ఇంద్రియ విషయ/వస్తువులను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.

భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలిగిపోయే పరమ శాంతి లభిస్తుంది. అలా ప్రసన్న చిత్తం తో ఉన్నవాని బుద్ధి శీఘ్రము గానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది.

మనస్సు, ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేనివానికి, స్థిరమైన బుద్ధి కాని, నిలకడైన భగవత్ ధ్యాస కాని ఉండవు. ఎవడైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు?

ఎలాగైతే బలమైన గాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.

కాబట్టి, ఓ అర్జునా, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియార్ధములనుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానం లో స్థిరముగా ఉంటాడు.

సర్వ భూతములకు ఏది పగలో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు సర్వ భూతములకు ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.

ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.

ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి, అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.

ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకం తో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.