Bhagavad Gita: Chapter 5, Verse 13

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।। 13 ।।

సర్వ — సమస్తమైన; కర్మాణి — కర్మలు; మనసా — మనస్సు చే; సన్న్యస్య — త్యజించి; ఆస్తే — ఉండును; సుఖం — సుఖముగా; వశీ — ఆత్మ-నిగ్రహం కలవారు; నవ-ద్వారే — తొమ్మిది ద్వారములు కల; పురే — నగరములో; దేహీ — దేహములొఉన్న జీవాత్మ; న — కాదు; ఏవ — నిజముగా; కుర్వన్ — చేయునది; న — కాదు; కారయన్ — కారణము కాదు.

Translation

BG 5.13: ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదని, దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు.

Commentary

నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకూ, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమైన యోగులు తమను తాము శరీరంగా భావించరు, అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులము అనుకోరు. సరికదా, శరీరమును, దానిచే చేయబడిన అన్ని క్రియలను భగవంతునికే చెందినవని భావిస్తారు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు, అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడిగా (సాక్షిగా) నిలిచిపోవటం. ఈ శ్లోకంలో ఉన్న ఉపమానము, శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడా పేర్కొనబడినది:

నవద్వారే పురే దేహీ హంసో లీలాయతే బహి:
వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ (3.18)

‘శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది - రెండు చెవులు, ఒక నోరు, రెండు నాసికారంధ్రాలు, రెండు కళ్ళు, అపానము, జననేంద్రియము. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను ఈ నవ ద్వార పట్టణంతో అనుసంధానం చేసుకుంటుంది. (తను శరీరమే అనుకుంటుంది). లోకంలోని సమస్త భూతములను నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ, భగవంతునితో అనుసంధానం అవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే స్వేచ్ఛను పొందుతుంది.’

ఈ క్రితం శ్లోకంలో జీవాత్మ దేనికీ కూడా కర్త కాదు, కారణం కాదు అని ప్రకటించాడు, శ్రీ కృష్ణుడు. మరైతే, ఈ లోకంలో అన్ని కర్మలకు భగవంతుడే కారణమా? అన్న ప్రశ్న పుడుతుంది. దీనికి తదుపరి శ్లోకంలో జవాబిచ్చాడు శ్రీ కృష్ణుడు.