Bhagavad Gita: Chapter 2, Verse 12

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ।
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ।। 12 ।।

న — ఎప్పటికీ కాదు; తు — కానీ; ఏవ — తప్పకుండా; అహం — నేను; జాతు — ఏ కాలంలో నైనా; న — కాదు; ఆసం — ఉండుట; న — కాదు; త్వం — నీవు; న — కాదు; ఇమే — ఈ యొక్క; జన-అధిపాః — రాజులు; న — కాదు; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; న భవిష్యామః — ఉండకుండా జరుగుట; సర్వే వయం — మనమందరమూ; అతః — ఇప్పటినుండి; పరం — తరువాత.

Translation

BG 2.12: నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము.

Commentary

డెల్ఫిలో వున్న టెంపుల్ అఫ్ అపోలో ద్వారం పై ‘జ్ఞోతి సూఎటోన్’ (Gnothi Seuton) అంటే ‘నిన్ను నీవు తెలుసుకో' అని అక్షరాలు చెక్కి ఉన్నాయి. ఏథెన్స్‌కి చెందిన పెద్దమనిషి, పండితుడు సోక్రటీస్ కూడా జనులను తమ ఆత్మ తత్త్వం గురించి విచారించమని ప్రోత్సహించేవాడు. ఒక స్థానిక కథ ఇలా చెప్పబడేది:

ఒకనాడు సోక్రటీస్ గాఢమైన తత్త్వ విచారణ ధ్యాసలో లీనమై వీధిలో వెళుతుండగా, ఒక ఆసామిని అనుకోకుండా తగిలాడు.

ఆ వ్యక్తి చికాకుగా అన్నాడు, ‘ఎక్కడ నడుస్తున్నావో చూసుకోలేవా? ఎవరు నువ్వు?’ అని.

సోక్రటీస్ తమాషాగా ఇలా బదులిచ్చాడు, ‘నేస్తమా, ఈ ప్రశ్న గురించే నేను గత నలభై ఏళ్లుగా ఆలోచిస్తున్నాను. నీకు ఎప్పుడైనా నేనెవరో తెలిస్తే, దయచేసి నాకు తెలియచెప్పు.’ అని.

వైదిక సంప్రదాయంలో, ఎప్పుడు దివ్యజ్ఞానం బోధించబడినా, సాధారణంగా అది ఆత్మ-జ్ఞానంతో మొదలవుతుంది. సోక్రటీస్‌కి పరమాద్భుతంగా అనిపించి వుండే ఈ విషయంతో, శ్రీ కృష్ణుడు అదే పద్ధతిని భగవద్గీతలో కూడా అనుసరిస్తున్నాడు. 'నేను' అని మనము అనుకునేది నిజానికి ఆత్మ అని, ఈ భౌతిక శరీరము కాదని, ఇది భగవంతుని వలె సనాతనమైనదని, శ్రీ కృష్ణుడు ఉపదేశాన్ని ఆరంభిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది:

జ్ఞాజ్ఞౌ ద్వావజా వీశనీశా-

వజా హ్యేకా భోక్తృ భోగ్యార్థ యుక్తా

అనంతశ్చాత్మా విశ్వరూపో హ్యకర్తా

త్రయం యదా విందతే బ్రహ్మమేతత్ (1.9)

 

పై శ్లోకం ఇలా చెప్తున్నది: సృష్టి అనేది మూడింటి కలయికతో ఉన్నది - భగవంతుడు, ఆత్మ, మరియు మాయ - ఈ మూడూ కూడా సనాతనమైనవే. మనము ఆత్మ నిత్యము అని నమ్మితే, ఈ భౌతిక శరీర మరణం తరువాత జీవితం ఉంటుంది అని సతర్కముగా నమ్మినట్టే. తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు దీని గురించి మాట్లాడుతాడు.